ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు ముచికుందునకుఁ దన వృత్తాంతము నెఱుఁగఁ జెప్పుట
“వసుదేవతనయుఁడ వాసుదేవుఁడను
నసమసాహసుఁ గంసు నవలీలఁ జంపి
మసలక రాక్షస మథనంబు సేసి
మథురాపురంబు నెమ్మది నేలుచుండ
నధికసత్వుఁడు కాలయవనుఁ డేతించి
నలిమీరి మాపట్టణము నిరోధింప
నెలయించి యాతని నిటుతోడితేర
నీకోపశిఖచేత నీరయ్యెనాతఁ
డేకతంబీ గుహనేల యున్నాఁడ? 640
వాదిరాజులకంటె నధికుండవైతి
మేదినీశ్వర! నిన్ను మెచ్చితి వరము
పోఁడిగా నిచ్చెదఁ బొరి నేదియైన
వేఁడుము నీ” వన్న వినతుఁడై పలికె
“దివ్యతేజోమయ! దేవేంద్రవంద్య!
అవ్యయాత్మజ! కృష్ణ! అంభోజనయన!
భక్తపరాధీన! భక్తలోకేశ!
భక్తవ్రజత్రాణ! పరమకల్యాణ!
రాజ్యంబు సేసి యారాజులలోన
పూజ్యుఁడనై మని పుత్రులఁ గంటి
ధనదాన్యవస్తుసంతతియందు నాకు
మనమురోయుట సేసి మదికోర్కెలుడిగె
నేకర్మములు మాని యీగుహాంతమున
నేకచిత్తుండనై యిటనిద్రవోవ
నామీఁదఁ గృపఁ గల్గి నన్నుమన్నింప
నీవిందు విచ్చేసితేఁ గృతార్థుఁడను;
బ్రహ్మయోగీంద్రులు భావింపలేని
బ్రహ్మమైతోఁచు నీ పదపంకజములుఁ
గనుఁగొంటి నీదులోకముఁ బ్రసాదింపు
వనజాక్ష ఏనొండు వరమొల్ల” ననుఁడు. - 650